Monday, August 28, 2023

chaitanya bhagavadgita 15th chapter- 16th slokam to 19th slokam

 chaitanya bhagavadgita 15th chapter - 16th slokam to 19th slokam

ద్వా విమౌ పురుషా లోకే క్షర శ్చాక్షర ఏవ చ ॥

క్షర స్సర్వాణి భూతాని కూటస్థో క్షర ఉచ్యతే ॥16 వ శ్లోకం 

ద్వౌ-ఇమౌ- పురుషా-లోకే-క్షరః-చ-అక్షర:-ఏవ-చ

క్షరః-సర్వాణి-భూతాని-కూటస్థ:-అక్షర:- ఉచ్యతే

లోకంలో పురుషులు ఇద్దరే ఉన్నారు. ఒకడు క్షర పురుషుడు. మరొకడు అక్షర పురుషుడు. సర్వ భూతములు క్షరములు. కూటస్థుడు అక్షర స్వరూపుడు.

వ్యాఖ్య

లోకంలో, అంటే సంసారంలో సోపాధిక చైతన్యము ఇద్దరు పురుషులుగా చెప్పబడుతూ ఉంది. ఒకడు క్షర పురుషుడు. మరొకడు అక్షర పురుషుడు. కార్యోపాధి కల వాడు క్షర పురుషుడు. కారణోపాధి కల వాడు అక్షర పురుషుడు. క్షరము అంటే నశించేది కనుక, నశించే కార్యోపాధి కల వాడు క్షర పురుషుడు (క్షరః క్షరతీతి క్షరః వినాశీ). అక్షర పురుషుడు అంటే దానికి భిన్నమైన వాడు. కారణోపాధి కల వాడు. కాల ప్రవాహంలో నశించని ఉపాధి కారణో పాధి. అదే భగవంతుని ఆశ్రయించుకొని ఉన్న మాయా శక్తి. త్రిగుణ మిళిత మైంది (అక్షరః తద్విపరీతః భగవతః మాయా శక్తిః).

క్షరోపాధి గల కార్య పురుషునికి ఉత్పత్తి స్థానం కావడం చేత, అక్షరోపాధి గల కారణ పురుషుడు, లేదా

మాయాశక్తి సంసారానికి బీజ భూత మైంది. క్షరోపాధి గల పురుషునికి ఉత్పత్తి బీజము. సంసారులైన ప్రాణుల కామ కర్మాది సంస్కారాలకు అక్షర పురుషుడే ఆశ్రయ స్థానము.

క్షర పురుషుడు

క్షరము అంటే నశించేది. ఒక కాలంలో కనిపించి మరొక కాలంలో కనుమరు గయ్యేది. వికారయుతమైంది. మర్త యాగము కనుక సకల భూతాలు, సర్వ కార్యాలు, ఇవన్నీ నడవటానికి ఆశ్రయమైన దృశ్యమాన జగత్తు - అంతా క్షరమే కనుక అది క్షర పురుషుడు. కార్యోపాధి గల వాడు. అంటే కార్య రూప ప్రపంచంగా గోచరించే వాడు (క్షరః సర్వాణి భూతాని సమస్తం వికార జాతమ్ ఇత్యర్థః ). ఆద్యంతాలు కలిగి కార్య రూపంలో గోచరిస్తూ, వికారాన్ని పొందుతూ, వినాశ మయ్యే సర్వభూత శరీరాలు క్షర పురుషుని క్రిందికే వస్తాయి.

అక్షర పురుషుడు

అనేక నామ రూపాలతో, అనేక విధాలుగా ఏదైతే కార్య రూపంలో గోచరిస్తూ ఉందో అట్టి వ్యక్త రూప ప్రపంచము క్షరము. వ్యక్త మయ్యే ఈ కార్య రూప జగత్తుకు కారణమై, ఏదైతే అవ్యక్తంగా ఉందో, అంటే వ్యక్తం కాకుండా ఉందో అదే అక్షరము. అవ్యక్తంగా ఉంటూ జగత్కార్యానికి కారణమైన మాయా శక్తియే అక్షరము. మార్పు లేనిది. కూటస్థము. కూటస్థము అనే పదాన్ని ఇక్కడ జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. అక్షర పురుషుడు కూటస్థుడు అని చెప్ప బడ్డాడు (కూటస్థః అక్షర ఉచ్యతే). పరబ్రహ్మమును 'కూటస్థం' అని, 'అక్షరం' అని ఇదివరకే మనం చెప్పుకొని ఉన్నాం (12 వ అ - 3 వశ్లో ) ఇక్కడ మళ్ళీ మాయను 'కూటస్థం', 'అక్షరం' అని చెప్పుకుంటున్నాం. ఈ తేడాను స్పష్టంగా గ్రహించాలి.

పరబ్రహ్మము సర్వాధారమై, సర్వ వికారాలకు ఆశ్రయమై, తాను స్వరూపతః అవికార్యమై ఉండటంచేత కూటస్థం అని చెప్పబడ్డాడు (కూటస్థః కూట రూపేణ తిష్ఠతి ఇతి). దాగలి వలె కూటస్థుడు అని కూడా చెప్పుకున్నాం. కాని, ప్రస్తుతం 'అక్షరము', 'కూటస్థము' అనే పదాలకు బ్రహ్మము అనే అర్థాన్ని గ్రహించ డానికి వీలు లేదు. కార్యమైన జగ ద్రూపంలో గోచరించే క్షర పురుషుడు కాల ప్రవాహంలో కరిగి పోతాడు. వ్యక్త మయ్యే

కార్య రూప క్షర పురుషునికి కారణమై, అవ్యక్తంగా ఉండే మాయ ఇక్కడ అక్షరంగా, కూటస్థంగా చెప్పబడింది.

'అక్షరము' అంటే పరబ్రహ్మము లాగా అవినాశి అని అర్థం కాదు. క్షరము లాగా కాలంలో నశించకుండా అవ్యక్తంగా ఉండి పునః సృష్టికి కారణ మవుతూ ఉంది అని అర్థము. ప్రళయ కాలంలో క్షర పురుషుడు నశించినా, అవ్యక్త మైన మాయ నశించకుండా ఉండి పునః జగత్కార్యానికి కారణం కావడం చేత అది సాపేక్షికంగా అక్షరమే గాని, పారమార్థికంగా అక్షర మైన బ్రహ్మము కాదు. జ్ఞానోదయంలో నశించే మాయ జ్ఞాన స్వరూపు డైన పరబ్రహ్మము లాగా అక్షర మెలా అవుతుంది?

అక్షర మెలాగో కూటస్థమూ అంతే. కూట మంటే మాయ అని, మోస మని, వక్ర మని, 

కుటిలత్వ మని కూడా అర్థాలున్నాయి 

( కూటః మాయా వంచనా జిహ్మతా కుటిలతా ఇతి పర్యాయాః ). మాయలో ఇవన్నీ ఉంటాయి. కనుక 'అక్షరము', 'కూటస్థము' అనే శబ్దాలు పరబ్రహ్మమును సూచించేవే అయినా, ఇక్కడ

వాటిని మాయకు అన్వయించు కోవాలి. ఉపాధులు క్షరమైనా, అక్షర మైనా అవి పరబ్రహ్మమునకు అన్యంగా ఉండ లేవు. క్షరాక్షరాలు రెండూ పరమాత్మకు ఉపాధులే కనుక, ఉపాధులను తొలగిస్తే, కేవలం శుద్ధ చైతన్యమే అద్వయంగా శోభిస్తుంది. తద్ధామ పరమం మమ అని ఆరవ శ్లోకంలో భగవంతుడు తెలిపింది ఇదే. నేతి నేతి : న హ్యస్మాత్పర మస్తి - ఇది కాదు, ఇది కాదు అని అన్నిటిని నిషేధిస్తూ, దానికంటే పర మైనది లేదు అని ఉపనిషత్తు దేని నైతే ప్రతిపాదించిందో, అదే క్షరాక్షరాలకు విలక్షణ మైన పరమాత్మ తత్త్యము. అదే పురుషోత్తమ తత్త్వము.

దానినే తరువాత శ్లోకంలో ప్రతిపాదిస్తున్నాడు.

ఉత్తమః పురుష స్త్యన్యః పరమాత్మే త్యుదాహృతః ।

యో లోకత్రయ మావిశ్య బిభ ర్త్యవ్యయ ఈశ్వరః ॥17  వ శ్లోకం 

ఉత్తమః-పురుషః-తు-అన్య:-పరమాత్మా-ఇతి-ఉదాహృతః

య:-లోకత్రయం-ఆవిశ్య-బిభర్తి-అవ్యయః- ఈశ్వరః

అర్జునా! నాశము లేని వాడు, ఈశ్వరుడు, ముల్లోకాలలో ప్రవేశించి భరించు ఉత్తమ పురుషుడే పురుషోత్తముడు.

వ్యాఖ్య

పూర్వ శ్లోకంలో మనం చూచిన క్షర అక్షర పురుషుల కంటే భిన్నమైన లక్షణాలు, భిన్నమైన స్వభావంగల ఉత్తము డైన పురుషుని ఈ శ్లోకంలో ప్రవేశ పెడుతున్నాడు. ఇతడు క్షరాక్షరముల కంటే విలక్షణ మైన వాడు (క్షరాక్షరాభ్యాం విలక్షణః). క్షర, అక్షర ఉపాధులు దోషాల చేత అంటబడని వాడు (క్షరాక్షరోపాధి ద్వయ దోషేణ అస్పృష్టః ). స్వతంత్రమైన వాడు. ఉపాధుల కన్నా పరముడు కావడం చేత ఉత్తమ పురుషుడు పరమాత్మ అయ్యాడు. కార్యోపాధికి అంటని వాడు కనుక పరమాత్మ అసంగుడు. కారణోపాధిని నియమించే వాడు కనుక

నియామకుడు. అసంగుడు, నియామకుడై నందున కార్యకారణో పాధులకు విలక్షణుడై ఉత్తమ పురుషుడయ్యాడు. పరమాత్మ నామధేయు డయ్యాడు (పరమాత్మ ఇతి ఉదాహృతః).

ఆత్మ శబ్దానికి అనేక అర్థాలున్నాయి. దేహమును ఆత్మ అంటారు. ఇంద్రియాలను ఆత్మ అంటారు. మనస్సును ఆత్మ అంటారు. ఇవన్నీ ఆత్మ శబ్దం తోనే వినిపిస్తాయి. ఈ ఆత్మ లన్నీ క్షర మైనవి. క్షర పురుషునకు సంబంధించినవి. పరిమిత మైనవి. పరిచ్ఛిన్న దోషముతో కూడినవి. వీటికి విలక్షణము, పరమైన ఆత్మయే పరమాత్మ (పరమశ్చ అసౌ ఆత్మా చేతి పరమాత్మా ). అన్యములైన ఆత్మల కన్నా భిన్న మైనది ( అన్యః అత్యంత విలక్షణః). అలాగే వాటి కన్నా ఉన్నత మైనది (ఉత్తమః ఉత్కృష్ట తమః). కార్యమైన క్షర పురుషుని కంటే, కారణమైన అక్షర పురుషుని కంటే విలక్షణుడు కావడం చేత పరమాత్మ (కార్య కారణ విలక్షణః) ఉత్తమ పురుషుడు. క్షరాక్షరములు రెండూ పరమాత్మకు ఉపాధులే కనుక, వ్యక్త మైన కార్య రూప జగత్తును, అవ్యక్తమైన కారణ రూప మాయను రెండిటినీ తానే భరిస్తున్నాడు. భరించడము అంటే, వాటికి సత్తా స్ఫూర్తి ప్రదాయకంగా ఉన్నాడని అర్థము. క్షరాక్షరాలకు పరమాత్మ వల్లనే సత్తా స్ఫురణలు కలుగు తున్నాయి అని భావము. క్షరాక్షరాల స్వరూపమే జగత్రయము కనుక, పరమాత్మ ముల్లోకాలను సృష్టించి, తానే వాటిలో ప్రవేశించి, వాటికి సత్తా స్ఫురణలను కలిగిస్తున్నాడు. ఈ విషయాన్ని శ్రుతి కూడా ధృవపరచింది. తత్పృష్ట్వాత దేవాను ప్రవిశత్ - తానే సృష్టించి, తానే అందులో ప్రవేశించి, అంతటా తానే వ్యాపించి (ఆవిశ్య), లోకత్రయాన్ని ధరిస్తున్నాడు, లేదా నిలుపు తున్నాడు (బిభర్తి ధారయతి ). ఇక చివరగా, శాస్త్ర స్తుతి చేస్తున్నాడు.ఇక్కడ ధరిస్తున్నాడు అంటే, బరువును మోస్తున్నాడు అని అర్థం కాదు. గుడ్డ వంతా మాలు వ్యాపించి ఉన్నట్లు, తన శక్తి చేత సర్వత్ర విస్తరించి ఉన్నాడని అర్థము. మట్టిపాత్రలలో మట్టి వ్యాపించి ఉన్నట్లు, అంతటా వ్యాపించి ఉన్నాడని భావము. ఈ విధంగా విలక్షణుడు కావడం చేత ఉత్తమ పురుషుడైన పరమాత్మ అవ్యయుడు. అంటే వ్యయం లేని వాడు. నాశ మెరుగని వాడు. మార్పు అర్థం కాని వాడు (అవ్యయః న అస్య వ్యయః విద్యతే ఇతి అవ్యయః ). తనకు మించిన వారు లేనందున తానే ఈశ్వరుడు. నియమించే శీలము కల వాడు. సర్వజ్ఞుడు (ఈశ్వరః సర్వజ్ఞః ఈశన శీలః). ఇంతవరకు ఈశ్వరుడుగా అభివర్ణింప బడిన వాడు పురుషోత్తముడే. ఆ పురుషోత్తముడు తానే అంటున్నాడు భగవంతుడు.

యస్మాత్ క్షర మతీతో హ మక్షరా దపి చోత్తమః ।

అతోస్మి లోకే వేదే చ ప్రథితః పురుషోత్తమః ॥ 18 వ శ్లోకం 

యస్మాత్-క్షరం-అతీతః-అహం-అక్షరాత్-అపి-చ-ఉత్తమః

అతః-అస్మి-లోకే-వేదే-చ-ప్రథితః-పురుషోత్తమః 

నేను క్షరమును, అక్షరమును రెండింటిని అతిక్రమించి ఉన్నాను. అందుచేత లోకము నందు, వేదము నందు పురుషోత్తముడుగా ప్రసిద్ధుణ్ణి.

వ్యాఖ్య

బ్రహ్మణో హి ప్రతిష్ఠా హం అని పూర్వాధ్యాయం చివరి శ్లోకం లోను, తద్ధామ పరమం మమ అని

ప్రస్తుత అధ్యాయం ఆరవ శ్లోకం లోను అభివర్ణించిన తన వైభవమును నిర్ధారించ డానికి తన పురుషోత్తమ తత్త్యమును తానే దర్శింప చేస్తున్నాడు, అశ్వత్థ మనే పేరు గల సంసార మాయా వృక్షమైన క్షరమును అతిక్రమించి ఉండుట చేత, అలాగే ఈ సంసార వృక్షానికి బీజ భూతమైన ప్రకృతి, లేదా మాయ అనే అక్షరమును అధిగమించి ఉండటమే గాక, దాని కంటే కూడా ఉత్కృష్టమైన వాడు కావడం చేత భగవానుడు పురుషోత్తముడు (క్షరమ్ అతీతః అతిక్రాన్తః అక్షరా దపి ఉత్తమః). దేహము క్షరము. దీనినే క్షేత్ర మని పదమూడవ అధ్యాయంలో చెప్పుకున్నాం. అలాగే క్షేత్రాన్ని పురం అని కూడా అర్థం చేసుకున్నాం. పురములో ఉండే వాడు పురుషుడు. పురమైన క్షేత్రము క్షరము కనుక నశిస్తుంది.

పురమును తెలుసుకొనే వాడు పురుషుడు లేదా క్షేత్రజ్ఞుడు. పురుషుడైన క్షేత్రజ్ఞుడు అక్షరము కనుక నశించడు. పురానికి పురుషుడు ఆధారంగా ఉన్నాడు. క్షరమైన పురమును, అక్షర మైన పురుషుని, ఇద్దరినీ ప్రకాశింప చేసే దివ్య చైతన్యం ఏదో అదే పురుషోత్తమ తత్త్వం. క్షరానికి, అక్షరానికి అతీత మైంది. అదే పురుషోత్తమ స్థితి. అదే సత్, చిత్, ఆనందంగా భాసిస్తూ ఉంది. అదే సర్వాధిష్ఠానంగా ప్రకాశిస్తూ ఉంది. ఏకమై, అద్వయమై, అఖండమై, అద్భుతంగా భాసించే దివ్య ప్రకాశైక చైతన్యం అదే.

దివ్యో హ్యమూర్తః పురుషః స బాహ్యాభ్యంతరో హ్యజః ।

అప్రాణో హ్యమనాః శుభ్ర హి అక్షరాత్ పరతః పరః ॥

'స్వప్రకాశు డైన పురుషుడు ఆకారం లేని వాడు. వెలుపల, లోపల నిండి యున్న వాడు. పుట్టుక లేని

వాడు. ప్రాణము లేని వాడు. మనస్సు లేని వాడు. నిర్మలమైన వాడు. అక్షర స్వరూపమునకు అతీతుడు' అన్నది ముండకోపనిషత్తు ( 2 -1 -2).

క్షరాక్షరముల కంటే ఉత్కృష్టమైన వాడు కావడం చేత (క్షరాక్షరాభ్యాం ఉత్తమత్వాత్) లోకము లోను,

వేదము నందును పరమాత్మ పురుషోత్తముడుగా ప్రసిద్ధుడు (లోకే వేదే చ ప్రథితః ప్రఖ్యాతః పురుషోత్తమః ). ఈ విధంగా పురుషోత్తమ తత్త్వమును తెలుసుకొను వారికి ఫల మేమిటో చెబుతున్నాడు.

యో మామేవ మసమ్మూడో జానాతి పురుషోత్తమమ్ |

స సర్వవి ద్భజతి మాం సర్వభావేన భారత ॥ 19 వ శ్లోకం 

యః-మాం-ఏవం-అసమ్మూఢః- జానాతి పురుషోత్తమం

స-సర్వవిత్-భజతి-మాం సర్వభావేన -భారత

అర్జునా! మోహము నుండి విడిపడిన వాడు, పురుషోత్తమ స్వరూపమును తెలుసుకున్న వాడు సర్వము తెలిసినవాడు అవుతాడు. అతడు అన్ని విధాల నన్నే పొందుతాడు.

వ్యాఖ్య

పురుషోత్తమ తత్త్వము అనే అఖండ జ్ఞానము యొక్క ఫలమును చెబుతున్నాడు. సర్వ వేద సారము, గీతా శాస్త్ర సారభూతము అయిన ఈ పదిహేనవ అధ్యాయమును అద్భుతంగా ప్రవచించిన భగవానుడు, అట్టి జ్ఞానము యొక్క ఫలమును విశదం చేస్తున్నాడు.

అర్జునా! పురుషోత్తముడ నైన నన్ను ఈ విధంగా (ఏవం) తెలుసుకున్న వాడు మోహము నుండి విడిపడు తున్నాడు. ఏవం ఈ విధంగా, అంటే, ముందు చెప్పుకున్న విధంగా (ఏవం యథోక్తేన ప్రకారేణ ) తెలుసుకున్న వాడు. అంటే కార్యోపాధిని పొంది నశించేది క్షర మని, కారణోపాధిని పొంది మార్పు చెందనిది అక్షర మని, కార్యకారణా లైన క్షరాక్షరములకు అన్యము, అతీతము, ఉత్కృష్ట మైనది పురుషోత్తముడని ఎవడైతే తెలుసుకుంటాడో వాడు సర్వమును తెలుసుకున్న వాడు అవుతున్నాడు (సర్వవిత్ - సర్వం వేత్తీతి). సర్వమును ఏమని తెలుసు కుంటాడు? సర్వము బ్రహ్మమే అని తెలుసుకుంటాడు. తనతో పాటు సమస్తమూ అద్వయ బ్రహ్మ స్వరూపమే అని తెలుసు కుంటాడు ( ఇదం సర్వం యదయ మాత్మా - బృహదారణ్యక శ్రుతి ; 2 - 4 - 6 ). సర్వమూ భగవంతుడే అనే సర్వాత్మ బుద్ధి కలిగి ఉంటాడు. అలాంటి వాడికి మోహం ఎలా ఉంటుంది? అందుకే అతడు అసమ్మూఢుడు (అసమ్మూఢః సంమోహ వర్జితః). ఊర్ధ్వమూలంగా వర్ణింపబడిన పురుషోత్తముని తెలుసుకున్న వాడు సమస్తము తెలిసిన వాడు అవుతున్నాడు 

( సర్వం జానాతి ఇతి ) . సర్వము తెలిసిన సర్వవిదుడు సర్వాత్మ స్వరూపుడైన పురుషోత్తముని యందే లగ్నమైన చిత్తముతో, ఆ సర్వాత్ముణ్ణి పొందుతాడు ( భజతి మాం సర్వ భావేన సర్వాత్మ చిత్తతయా). ఇదే సర్వాత్మ జ్ఞానఫలం. పురుషోత్తమ ప్రాప్తిఫలం.

ఈ జ్ఞానము సుస్పష్ట మైంది. స్వచ్ఛమైనది. ఈ జ్ఞానమును పొందిన వాడు నిత్యానంద స్వరూపుడు

అవుతున్నాడు. అతడికి ప్రపంచం గోచరించినా అది విస్మృత ప్రాయము.  కర్తృత్వము అర్థం కాని వాడు. భోక్తృత్వం పై ఆసక్తి లేని వాడు. గతం అతనిని కలత పెట్ట లేదు. భవిష్యత్తు అతనిలో ఆశలు రేప లేదు. వర్తమానం జ్ఞాన స్నానం చేస్తూ ఉంటుంది.

అతడు సముడు. అతనిలో అంతా సమత్వమే. అతడు సమదర్శి, రాగాలు వినిపించవు. ద్వేషాలు కనిపించవు. నిందలు బాధించవు. స్తుతులు తృప్తి నివ్వ లేవు. అతడు ఆకాశము వంటి వాడు. అతని లోపల,  అతని చుట్టూ ఎన్ని కదలి పోతూ ఉన్నా తాను అస్పరుడై ఉంటాడు. అసంగుడై ఉంటాడు. మేలుకున్న వాడికి స్వప్న మెలా ఉంటుందో, జ్ఞానికి ప్రపంచం అలా ఉంటుంది. తాను అకర్త గానే చరిస్తాడు. అభోక్త గానే శోభిస్తాడు. ఆలయంలో భగవంతు డున్నట్లు, జ్ఞాని హృదయాలయంలో పురుషోత్తముడు దేదీప్యమానంగా ప్రకాశిస్తూ ఉంటాడు. ఆత్మజ్ఞానికి జీవత్వం లేదు. అతడే దేవుడు. ఆ మహాత్ముని పొందిన పుణ్య దేహము కదిలే దేవాలయం. అతనికి ఆత్మ తప్ప మరొకటి కనిపించదు. ఏది కనిపించినా అది ఆత్మ గానే దర్శన మిస్తుంది. అదొక మంగళకర మైన దృష్టి, ఆత్మదృష్టి. సర్వాత్మ దృష్టి, బ్రహ్మదృష్టి, బ్రహ్మాత్మ జ్ఞాన దృష్టి. బ్రహ్మ విజ్ఞాన సంపన్నః ప్రతీత మఖిలం జగత్ | పశ్యన్నపి సదా నైవ పశ్యతి స్వాత్మనః పృథక్, 'బ్రహ్మజ్ఞాన సంపన్నుడు కనిపించే ప్రపంచమును చూస్తూ ఉండినా, దానిని ఆత్మ కంటే వేరుగా చూడడు' అన్నది వరాహోపనిషత్తు.




No comments:

Post a Comment